రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025:
హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించారు. పక్కన ఆయన బుల్లెట్ వాహనం ఉంది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి తన బుల్లెట్పై వస్తునండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయి. హెల్మెట్ ధరించినా ముఖంపై కూడా తీవ్రమైన గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ పలు టివి ఛానళ్లలో చర్చాగోష్టిలో వాదనలు గట్టిగా విన్పించడం ద్వారా పలువురికి టార్గెట్ అయ్యారని, తరచూ ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చేవని క్రైస్తవ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో చాగల్లులో జరగనున్న క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ప్రవీణ్ ఇక్కడకు వస్తున్నట్లు తెలిసింది. రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువులోగల ఆయన విశ్రాంతి తీసుకొనే ఫ్లాట్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారా? లేదా ఎవరైనా దాడి చేసి హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఘటన స్థలాన్ని రాజానగరం పోలీసులు పరిశీలించి ప్రవీణ్ భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద పలు క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఆయన మృతదేహాన్ని హోసన్న మినిస్ట్రీ నిర్వాహకులు జాన్ వెస్లీ, యంగ్ హోలీ టీమ్ నిర్వాహకులు జాన్ వెస్లీ, విజయకుమార్ రెడ్డి, మాజీ ఎంపి జివి.హర్షకుమార్, మహాసేన రాజేష్, దళిత నాయకులు అజ్జరపు వాసు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ప్రవీణ్ మృతిపై అనుమానాల నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతదేహంపై గాయాలు ఉండటంతో, ఈ మరణం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. హెల్మెట్ ధరించినప్పటికీ ముఖంపై తీవ్ర గాయాలు ఉండడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అంతేగాక, హోం మంత్రి అనిత కూడా ఈ కేసును లోతుగా పరిశీలించేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం, పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోరెన్సిక్ నివేదికలు, మరియు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారిక దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది








